skip to main |
skip to sidebar
ఆర్టీసీ కార్మికులతో కేకే చర్చలు..? సమ్మెకు తెరపడుతుందా ?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg5PQ8Px-D15bjHSbmIUjDGcvSKc-V8Fccayy4ziMQ0TS0h1-zNmQPBu2602TC3ugwicdzSynW42XwhQegZAI5ZsqnwRmBKpUOC5rCNHYCReaodbE4ZZ6o2mGIu0qdFeGAnc1tU8IiVvmA/s1600/Narsapur+Guide.PNG)
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతుండటంతో...ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు కార్మికులతో చర్చలు జరపకుండా కేవలం ప్రత్యామ్నాయాలపైనే ఫోకస్ పెట్టిన సర్కార్..కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి మరింతగా చేయి దాటితే...ఆ తరువాత పరిణామాలు మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం సీఎం కేసీఆర్...వ్యూహాత్మంగా టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావును రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం కేకే పత్రికా ప్రకటన విడుదల చేయడం...ఆ తరువాత దీనిపై కార్మిక సంఘాల కీలక నేత అశ్వత్ధామ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో...చర్చలపై కొత్త ఆశలు చిగురించాయి. కేసీఆర్ తరువాత వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే దిట్టగా పేరున్న కే.కేశవరావు...సమ్మెను విరమింపజేసే విషయంలో కార్మికులను ఒప్పిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఢిల్లీలో ఉన్న కేకే...హుటాహుటిన హైదరాబాద్ రానున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. ఈ అంశాలతోనే కేకే కార్మిక సంఘాలను ఒప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేత కేశవరావు... తీవ్రతరంగా మారుతున్న ఆర్టీసీ సమ్మెను కూడా తనదైన నేర్పుతో పరిష్కరిస్తారేమో చూడాలి.